మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
25-02-2018 Sun 22:13

ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ మనసుకు ఏదీ తట్టదు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా..? మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.. మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండడానికి తోడ్పడే పది అంశాలేమిటో తేల్చారు. వాటి గురించి తెలుసుకుందాం..
1. రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం

- ‘‘వ్యాయామం చేస్తే కండరాలే శరీరంలోని శక్తి (రక్తంలోని గ్లూకోజ్)లో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటాయి. దీంతో ఇతర భాగాలు, అవయవాలు, మెదడుకు కూడా గ్లూకోజ్ సరిపడినంతగా అందదు. మెదడు, నాడీ వ్యవస్థలోని నాడీ కణాలు (న్యూరాన్లు) అత్యంత సున్నితమైనవి. వాటికి కనీసం ఒకటి రెండు నిమిషాలు శక్తి అందకపోయినా దెబ్బతింటాయి. కానీ శరీర వ్యవస్థ మొత్తం మెదడుకు పూర్తిస్థాయి రక్షణ, ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందించబడి ఉంటుంది. దాంతో వ్యాయామం వల్ల శరీరంలో శక్తి తగ్గినప్పుడు.. మెదడును, నాడీ కణాలను రక్షించుకునేందుకు అవసరమయ్యే ప్రొటీన్లు, హార్మోన్లు వంటివి విడుదలవుతాయి. ఇదే సమయంలో ఇతర అవయవాలకు శక్తి రవాణాను తగ్గించి.. మెదడుకు అందిస్తాయి. దాంతో మెదడు మరింత శక్తిని పుంజుకుంటుంది..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఫెర్నాండో గొమెజ్ వెల్లడించారు.
- అయితే ఇది కొంత సమయం వరకు అంటే రోజూ 30 నిమిషాలు లేదా గంట వరకు మాత్రమే పనిచేస్తుందని.. దీర్ఘకాలం పాటు గ్లూకోజ్ తక్కువగా అందితే మెదడు పనితీరు దెబ్బతింటుందని హెచ్చరించారు.
2. కడుపు మాడ్చుకోవద్దు..
మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతం వరకు మాత్రమే ఉంటుంది.. కానీ అది వినియోగించుకునే శక్తి ఏకంగా 20 శాతం. శరీరంలో అధికంగా గ్లూకోజ్ ఉండడం లేదా అతి తక్కువగా ఉంటుండడం వంటివి మెదడులోని సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల మెదడులో కీలకమైన ‘ఫ్రంటల్ కార్టెక్స్’ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని గుర్తించినట్లు వారు చెబుతున్నారు. అందువల్లే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఏదైనా విషయంపై దృష్టి సారించలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, గందరగోళ పడడం వంటివి తలెత్తుతాయని స్పష్టం చేస్తున్నారు.
- ఇక ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
- శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా తక్కువగా ఉండకుండా ఉండాలంటే.. ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
3. ఆహారంలో సమతుల్యత ముఖ్యం

- ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలని, ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్ వీలైనంత తక్కువగా ఉండాలని బ్రిటన్ కు చెందిన ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ గ్రీన్ చెబుతున్నారు. శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో దీర్ఘకాలంలో మెదడు సామర్థ్యం తగ్గిపోయినట్లుగా తమ అధ్యయనంలో గుర్తించామని వెల్లడించారు.
- ఆహారంలో అధిక కొవ్వుల కారణంగా మెదడులో జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానమైన హిప్పో కాంపస్ భాగం పనితీరు దెబ్బతింటుందని మైఖేల్ గ్రీన్ పేర్కొన్నారు. అయితే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మాత్రం మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలకు ఇది బాగా అవసరమని తెలిపారు.
4. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..
మనం శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉంటే.. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏదైనా వ్యాధులు, జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. అది మెదడుపై, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పట్టిపీడించే టైప్-2 మధుమేహం, ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటివి మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయి. వాటి వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆలోచించే శక్తి, విశ్లేషణా సామర్థ్యం కూడా తగ్గిపోతాయి.
- మధుమేహం, ఊబకాయం సమస్యలు ఉన్న వారికి శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని, దానివల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఇక ధూమపానం, ఆల్కాహాల్ వంటి అలవాట్ల కారణంగా.. శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడం, అవి మెదడు పనితీరును దెబ్బతీయడం జరుగుతుంది. అందువల్ల పొగతాగడానికి, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి.
5. తగినంత, సరైన నిద్ర, విశ్రాంతి అవసరం

- అయితే మనం నిద్రపోయినప్పుడు కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అప్పటివరకు జరిగిన, విన్న, చూసిన ఘటనలకు సంబంధించి సమాచారాన్ని నిద్రా సమయంలోనే విశ్లేషించుకుంటుంది. ప్రతి అంశాన్ని జ్ఞాపకంగా మార్చకుండా.. కొన్ని ఘటనలను తొలగించేస్తుంది. మరికొన్నింటిని తాత్కాలిక జ్ఞాపక శక్తిగా, మరికొన్నింటిని శాశ్వత జ్ఞాపకాలుగా మార్చి భద్రపరుస్తుంది. తద్వారా మెదడుపై భారం తగ్గిపోయి.. విశ్రాంతి స్థితికి వెళుతుంది. తిరిగి మనం నిద్ర లేచిన తర్వాత పూర్తి శక్తితో చురుగ్గా పనిచేస్తుంది.
- తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.
- రోజు మధ్యలోనూ కొంతసేపు అంటే పది, పదిహేను నిమిషాల పాటు కునుకు తీస్తే.. మెదడులో ఏర్పడే ప్రొటీన్లు బయటికి వెళ్లిపోయి, కాస్త విశ్రాంతి లభించి తిరిగి చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
- నిత్యం ఏదో మనసులో పెట్టుకుని కలత నిద్ర పోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది.
- కనీసం ఆరు గంటల పాటు గాఢంగా నిద్రపోయే వారిలో జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం బాగా ఉంటుందని అమెరికన్ పరిశోధకులు తమ అధ్యయనాల్లో తేల్చారు.
6. మెదడును చురుగ్గా ఉంచే కాఫీ, టీ
సాధారణంగా మనం రోజూ కాఫీ, టీలను తాగుతూనే ఉంటాం. వీటివల్ల కొన్ని రకాల ప్రతికూల ప్రభావాలు ఉన్నా.. మెదడు విషయానికి వస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ మితంగా కాఫీని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఆలోచించాల్సి వచ్చినప్పుడుగానీ, దేనిగురించైనా విశ్లేషించాల్సి వచ్చినప్పుడుగానీ కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది.కాఫీ, టీలలో కెఫీన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కెఫైన్ తో పాటు ఉండే పలు రకాల యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు మెదడులో ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే ప్రొటీన్లను తొలగిస్తాయని.. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
- దీర్ఘకాలంలోనూ కాఫీ వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని, అల్జీమర్స్ (వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు) వ్యాధి వచ్చే అవకాశాలను ఇది 30 శాతం వరకు తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
- రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగవచ్చని.. అంతకు మించే మాత్రం ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు అధికమొత్తంలో కెఫీన్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.
7. చేపలు తినండి

- డిప్రెషన్ వంటి వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చేపలు తింటే ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ప్రస్తుతం ఒమేగా-3 సప్లిమెంట్లు (మాత్రలు) అందుబాటులో ఉన్నాయి. కానీ అలా కృత్రిమంగా రూపొందించిన వాటికన్నా ఆహారం రూపంలో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.
- చేపలతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, గడ్డి తినే జంతువుల మాంసంలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.
8. సరదాగా గడపండి
నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఒత్తిడులు, అతిగా ఆలోచించడం కారణంగా మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో హానికర రసాయనాలు ఉత్పత్తి అవుతాయని.. అవి మెదడు పనితీరును మందగింపజేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి మందగిస్తుందని, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల జీవన విధానంలో కొన్ని తప్పనిసరి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
- ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే యోగా, ధ్యానం వంటివాటిని రోజూ కొంతసేపు చేయాలి.
- వారంలో ఒక రోజు పని ఒత్తిడులకు దూరంగా, రోజువారీ ఆలోచనలను వదిలివేసి సరదాగా గడపాలి.
- వీలైతే మనకు ఇష్టమైన ఆటలపైగానీ, చిత్రలేఖనం వంటి వాటిపైగానీ దృష్టి పెట్టాలి. లేదా సంగీతం వినడం, సినిమాలు చూడడం వంటివీ చేయవచ్చు.
- అన్నింటికన్నా ముఖ్యంగా మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని గుర్తుచేసుకుంటూ.. దాని ద్వారా మరింత ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలి.
9. అనవసర మందులు, ఔషధాలకు దూరంగా ఉండండి

- ఏ రకమైన ప్రొటీన్లు, విటమిన్లు అయినా సహజ ఆహారం రూపంలో శరీరం సంగ్రహిస్తేనే ప్రభావవంతంగా పనిచేస్తాయని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
- అడ్డగోలుగా సప్లిమెంట్లను వినియోగించడం వల్ల అధిక రక్తపోటు, జీర్ణాశయ సమస్యలు, లైంగిక పటుత్వం కోల్పోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
10. మెదడుకు ‘పని’ పెట్టండి!

- విద్యను అభ్యసించడం, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండడం వల్ల కూడా మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది.
- రోజూ కొత్త కొత్త పజిళ్లను, కాస్త క్లిష్టమైన పజిళ్లను పూరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకు వచ్చినవారు ఇలా చేయడం వల్ల వారిలో అల్జీమర్స్ వంటివి వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
Advertisement 2
More Telugu Articles
Advertisement 3
Advertisement 4